September 20, 2024

ఎన్టీఆర్ వ్యక్తి కాదు …ప్రభంజనం:తాళ్ళూరి సురేష్

చెన్నైన్యూస్:ఎన్టీఆర్….ఎన్టీఆర్…ఎన్టీఆర్…
ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనం, తెలుగువాడి గుండె చప్పుడు.అటు చలనచిత్ర రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఏకఛత్రాధిపతిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు .తెలుగు తెరపై రాముడైనా,రావణుడైనా,కృష్ణుడైనా,దుర్యోధనుడైనా, వేంకటేశుడైనా, పరమ శివుడైనా.. ఏ పౌరాణిక పాత్ర పోషించినా అందులో ఎన్టీఆర్ ది ఒక ప్రత్యేకమైన శైలి. ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగువారి మనసుల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు ఎన్టీఆర్.

  చెన్నై రెడ్ హిల్స్ సమీపంలోని పుళల్ కావాంగరైలో నివస్తున్న ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జనవరి 18వ తేదీ  గురువారం ఉదయం ఎన్టీఆర్ 29వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు.ఎన్టీఆర్ వీరాభిమానులు జి.వెంగయ్య,లయన్ జి. మురళి ల అధ్యక్షతన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి.ముఖ్య అతిథిగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఉత్తర చెన్నై ఉపాధ్యక్షుడు , కమ్మనాయుడు సంఘం నేత  తాళ్ళూరి సురేష్ విచ్చేసి అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలు చల్లి నివాళ్ళు అర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా తాళ్ళూరి సురేష్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులచే అన్న అని అభిమానంగా పిలుపించుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు.

.తెలుగు గంగా ప్రాజెక్టు తీసుకుని వచ్చి తమిళనాడు ప్రజలకు దాహార్తిని తీర్చిన గొప్ప మానవతావాది ఎన్టీఆర్ అని ,అంతే కాదు …తెలుగు భాషకంటూ ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చారన్నారు . రాష్ట్రంలో స్థిరపడిన తెలుగువారంతా ఐక్యంగా ఉండి మనహక్కులను నిలబెట్టుకోవాలని సురేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత
గా ఆంధ్రుల అభిమాన నటుడుగా , ఉమ్మడి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నందమూరి తారకరామారావు యుగపురుషుడు అని ఈ సందర్భంగా కొనియాడారు.అనంతరం లయన్ జి. మురళి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక ప్రభంజనం అని , శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, కర్ణుడు ,దుర్యోధనుడు తదితర పురాణపురుషులను తన పాత్రల ద్వారా ఎన్టీఆర్ మన కళ్ళ ముందు ప్రదర్శించి మెప్పించారన్నారు.ఎన్టీఆర్ దేశరాజకీయాల్లో చక్రం తిప్పి చరిత్రలో శాశ్వితంగా నిలిచిపోయారని మురళి అభిప్రాయపడ్డారు. జి.వెంగయ్య మాట్లాడుతూ తెలుగు పదానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకుని వచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. కోట్లాదిమంది జనహృదయాల్లో నేటికి జీవిస్తున్నారని , తెలుగు జాతి ఔన్నత్యానికి, ఆత్మగౌరవానికి నందమూరి తారకరామారావు ప్రతీకగా నిలిచారన్నారు.

       ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు డి ఆర్ ఎల్ కృష్ణ ,బాలాజీ, దామోదర శెట్టి ,గురువారెడ్డి ,రవి ,మునిస్వామి ,వి ఎల్ టి మురళి, నరసింహారావు, ప్రకాష్, చిట్టిబాబు ,బి మురళి, రామారావు, మస్తాన్ రెడ్డి నాగరాజు, బి కిష్టయ్య ,శివ శంకర్, ఆర్ ఎస్ ఎస్ కు చెందిన ఉలగరాజన్ రంజిత్ జీ, పొన్నేరి శంకర్ ఇంకా మహిళా అభిమానులు రాధ, మీనా,  సుబ్బమ్మ ,గంగాభవాని, పెంచలమ్మ, దొరసానమ్మ ,పావని తదితరులు పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులర్పించారు

About Author