September 20, 2024

ఎస్ కె పి డిలో అత్యంత వైభవంగా ముగిసిన శ్రీ వాసవీ వసంతోత్సవాలు

చెన్నై న్యూస్ : చెన్నై లోని 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఏప్రిల్ 29 వ తేదీ నుంచి మే 7 వ తేదీ వరకు నిర్వహించిన వాసవీ వసంతోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి.ఒక్కో రోజు ఒక్కో అలంకరంతో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కొలువుదీర్చి విశేషంగా పూజలు నిర్వహించారు. ప్రధానంగా దంత పల్లకిలో అమ్మవారిని కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో నిర్వహించిన ఉరేగింపు మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అలాగే సింహవాహనం పై , బంగారు కేడెము పై కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు వాసవీ అమ్మవారిని దర్శించుకుని తరించారు.అలాగే వసంతోత్సవాల్లో భాగంగా మే 5 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు ఆలయ మహా మండపంలో కృత్రిమంగా కొనేరును ఏర్పాటు చేసి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి తెప్పోత్సవంను మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. కొనేరులో తెప్ప పై అమ్మవారిని విహరింపజేస్తూ సాగిన తెప్పోత్సవం భక్తులను కనువిందు చేసింది.ఈ తెప్పోత్సవం వేడుకల్లో ఆలయ ధర్మకర్త కొల్లా వేంకట చంద్రశేఖర్ తో పాటు పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్ కుమార్, దేసు లక్ష్మీ నారాయణ, S.L. సుదర్శనం , టి వి రామ కుమార్ , C.R .కిషోర్ బాబు , SKPD చారిటీస్ సెక్రెటరీ కిషోర్ కుమార్ , భక్తులు పాల్గొని శ్రీ వాసవీ అమ్మవారి సేవలో తరించారు. తొమ్మిది రోజులు పాటు సాగిన శ్రీ వాసవీ వసంతోత్సవాల్లో ప్రతీ రోజు వివిధ బృందాలు నృత్యాలతో , భక్తి గీతాలతో సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభను సంతరించు కున్నాయి. చివరి రోజైన మే 7 వ తేదీన నగరానికి చెందిన సంగీత కళాకారిణి విజయలక్ష్మి చుక్కల బృందం ఆలపించిన భక్తిగీతాలపణలు వీణులవిందు చేశాయి. ప్రత్యేకించి అదిగో అల్లదిగో శ్రీహరివాసము, శంభో మహాదేవ అనే పాటలు శ్రావ్యమైన గానంతో పాడి అందరి కరతాలధ్వనులు అందుకున్నారు.
చివరిరోజు ఉభయ దారులుగా మద్దాలి కాశీ విశ్వనాధం, శ్రీ శ్రేష్ఠ సేవా సంఘం, కాళంగి లక్ష్మీ నారాయణ కుటుంబం వ్యవహరించారు. మే 18న నిర్వహించనున్న శ్రీ వాసవీ జయంతి సందర్భంగా మే 15వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఆలయంలో శ్రీ వాసవీ లక్షార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు.ప్రతీ రోజు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు శ్రీ వాసవీ లక్షార్చన జరుగునుండగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు.

About Author