September 20, 2024

సదరన్ ఇండియా వైశ్య సంఘం ఆధ్వర్యంలో సిక్స్ రెడ్స్ స్నూకర్ పోటీలు

చెన్నై న్యూస్:చెన్నై జార్జిటౌన్ గిడ్డంగి వీధిలోని 119 ఏళ్ళ చరిత్ర కలిగిన సదరన్ ఇండియా వైశ్య సంఘం (శివ) ఆధ్వర్యంలో సిక్స్ రెడ్స్ స్నూకర్ ఛాంపియన్ షిప్ -2024 పోటీలు ఏప్రిల్ 13, 14 తేదీల్లో జరుగనున్నాయి.ఈ సంఘంలో బిలియడ్స్ క్రీడా విభాగం ప్రారంభించి 80 ఏళ్ళు పూర్తి కానున్న సందర్భంగా ,అలాగే తెలుగు ఉగాది, తమిళ నూతన సంవత్సరాధిని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా ఈ స్నూకర్ పోటీలు నిర్వహించనున్నారు. అసోసియేషన్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంఘం అధ్యక్షులు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు పోటీల వివరాలను వెల్లడిస్తూ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నవారు , వారి పిల్లలకు ప్రవేశ రుసుం లేకుండా 18 ఏళ్ల నుంచి 72 ఏళ్ల వృద్ధుల వరకు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించామన్నారు. టోర్నమెంట్ లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో నమోదు చేసుకున్నట్టు తెలిపారు. శివలో 3000 మందికి పైగా సభ్యులు ఉన్నారని ,వీరి పిల్లలు క్రీడల్లో రాణించాలన్న ఉద్దేశంతో తమ సంస్థ తరపున వివిధ రకాల క్రీడాలపై తర్ఫీదు ఇప్పిస్తున్నామన్నారు. భవిష్యత్ లో వారు జిల్లా ,రాష్ట్ర ,జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహింస్తున్నట్టు తెలిపారు. స్నూకర్ పోటీల్లోని విజేతలకు ట్రోఫీలు, ప్రశంస పత్రాలు అందిస్తున్నట్టు శంకర రావు తెలిపారు.అనంతరం టోర్నమెంట్ డైరెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ఈ నెల 13 వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు స్నూకర్ టోర్నమెంట్ ను అజంతా శంకర రావు ప్రారంభిస్తారని తెలిపారు. చివరి రోజు ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఫైనల్స్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తామని, ఈ కార్యక్రమంలో స్నూకర్ వరల్డ్ ఛాంపియన్ అనుపమ రామచంద్రన్ , జాతీయ ఛాంపియన్ శ్రుతి లక్ష్మీనారాయణ లు పాల్గొంటారని తెలిపారు.శివ సహకారంతో త్వరలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవ సంయుక్త కార్యదర్శులలో ఒకరైన పువ్వాడ అశోక్ కుమార్, కమిటీ సభ్యులు, తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కె కె త్రినాధ్ కుమార్, కో- ఆర్డినేటర్ రామనారాయణ తదితరులు పాల్గొన్నారు.
..

About Author