September 20, 2024

కోలాహలంగా తెలుగు తరుణీ 9వ వార్షికోత్సవ వేడుకలు

చెన్నై న్యూస్: చెన్నైకు చెందిన తెలుగు తరుణీ సంస్థ 9వ వార్షికోత్సవ వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఆదివారం రాత్రి ఏర్పాటు అయిన ఈ వేడుకలకు మైలాపూర్ లజ్ చర్చి రోడ్డులో ఉన్న ఆంధ్ర మహిళా సభ వేదికైంది. ఈ వేడుకలను తెలుగు తరుణుల బృందం మా తెలుగు తల్లికి మల్లెపూదండ….'” అంటూ ప్రార్థనా గీతం ఆలపించి ప్రారంభించారు.అనంతరం అరుణా శ్రీనాథ్ నేతృత్వంలో తెలుగు తరుణులు వినాయక ప్రార్ధన తెలుగు ప్రాశస్థ్యం తెలిపే పాటను వీనులవిందుగా గానం చేసి అలరించారు.

 అనంతరం తెలుగు తరుణి అధ్యక్షురాలు కె.రమణి స్వాగతోపన్యాసం చేశారు.కార్యదర్శి  దేవసేన వార్షిక నివేదికను సమర్పించారు. సంస్థ వార్షికోత్సవం సందర్భంగా  2024 సంవత్సరానికి. గాను  సీనియర్ పాత్రికేయురాలు , రచయిత్రి  కమలాకర రాజేశ్వరిని శ్రీకాంత బిరుదుతో  ఘనంగా సన్మానించారు. సభకు ముఖ్యఅతిధిగా పాల్గొన్న రాజేశ్వరి మాట్లాడుతూ  తెలుగు తరుణి వ్యవస్థాపకులు  కీర్తిశేషులు డాక్టర్ మాజేటి జయశ్రీ ఆలోచన నుంచి అంకురించిన తెలుగు తరుణి దీపం ఎందరో తరుణులకు స్ఫూర్తినిస్తూ కె.రమణి ఆధ్వర్యంలో మరింతగా విస్తరించాలని  ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ సుమబాల తెలుగు తరుణీ సేవలను అభినందించారు. అలాగే స్టార్ సింగర్ విజేతగా నిలిచిన చిన్నారి శ్రేయాన్వికి చిరు సత్కారం చేశారు. 10, 12 తరగతుల్లో ప్రతిభ కనబరిచిన తెలుగు విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహు మతిని అందజేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశారు. సంస్థ సభ్యురాలు అపర్ల సుదీశ్ నేతృత్వంలో తెలుగు తరుణులు చేసిన నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది.అలాగే టి .నగర్ కేసరి మహోన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన మయసభ అబ్బుర పరిచింది.సంస్థ సభ్యులు కర్లపాటి శైలజ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి పాల్గొని తెలుగు భాషను మరవద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు. సంస్థ కోశాధికారి మాజేటి అపర్ణ తో పాటు సభ్యులు శ్రీదేవి, సురేఖ , కర్లపాటి పద్మ, నందిని, కర్లపాటి లక్ష్మి, దీప , మాధవి , అంజనాని తదితరులు విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు. నుంగంబాక్కం శ్రీ వెంకటేశ్వర తెలుగు పాఠశాలకు ఫ్లాష్ లైట్ ను సంస్థ అధ్యక్షురాలు కె.రమణి స్పాన్సర్ చేశారు.

About Author