September 19, 2024

వీనులవిందుగా సంగీత దర్శకులు సాలూరి వాసు రావు బృందం సంగీత విభావరి

చెన్నై న్యూస్ : చెన్నై రాయపేటలోని పురాతన గౌడియా మఠంలో శ్రీ కృష్ణ జయంతోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.ఈ వేడుకల్లో బుధవారం నిర్వహించిన నందోత్సవ వేడుకలు సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు బృందం నిర్వహించిన సంగీత విభావరి వీనుల విందుగా సాగింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సంగీత కార్యక్రమం భక్తులను సమ్మోహితులను చేసింది. సంగీత దర్శకులు సాలూరి వాసు రావు సారథ్యంలో 28వ వార్షిక సంగీత విభావరి జరిగింది. ఇందులో సంగీతకారులు మాధవీసంతోష్, కిడాంబి లక్ష్మీకాంత్, మాస్టర్ శశాంక్ సంతోష్ , సంగీత దర్శకులు తమన్ తల్లి సావిత్రిశివకుమార్ ఘంటసాల పలు భక్తి గీతాలను ,భజన పాటలను శ్రావ్యంగా ఆలపించి ఆహుతులను వీనులవిందు చేశారు. తబలా పై సాలూరి వెంకట్రావు, కీబోర్డు పై అస్మత్ మీరాబాబు , మృదంగంపై సుబ్రమణ్యంలు చక్కని వాయిద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా సాలూరి వాసు రావు మాట్లాడుతూ మధుర గాయకులు ఘంటసాల వేంకటేశ్వరరావు, ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావుల తరం నుంచి ఈ వేదిక మీద నిరంతరాయంగా సంగీత కార్యక్రమాలు జరిగేవని అన్నారు. గత మూడు దశాబ్దాలుగా నిరంతరంగా ప్రతీ సంవత్సరం నందోత్సవం రోజున తాను సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ వేదికపై కచేరిలో పాడిన గాయనీ గాయకులు ఉన్నత స్థానంలో నిలిచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నారు. ఈ మఠానికి ఎన్నో ఏళ్లు చరిత్ర ఉందని ఇటువంటి పవిత్రమైన సన్నిధిలో తాను నిరంతరాయంగా సంగీత విభావరి నిర్వహిస్తుండడం తన పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు. తమ అవకాశం కల్పిస్తున్న గౌడియా మఠంలోని శ్రీకృష్ణుడి దేవాలయం లో ఉన్న లలిత్ స్వామీజీకి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

About Author