September 20, 2024

తెలుగు విద్యార్థులకు అండగా తెలుగు తరుణి ఉంటుంది…అధ్యక్షురాలు కె.రమణి

చెన్నై న్యూస్:సఖ్యత , సభ్యత,స్వచ్ఛత మా ధ్యేయాలు అంటూ తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తున్న తెలుగు తరుణి ఆధ్వర్యంలో తెలుగు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలు ఆహ్లాదకరంగా ,పోటాపోటీగా సాగాయి.విద్యార్థిని విద్యార్థులు తమదైన ప్రతిభతో అందరి ప్రసంశలు అందుకున్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు తరుణి అధ్యక్షురాలు కె.రమణి అధ్యక్షతన ఫిబ్రవరి 22 వ తేదీ గురువారం ఉదయం చెన్నై టీ .నగర్ లోని ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.

ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్, చేతిరాత, పద్యపఠనం పోటీలు నిర్వహించగా, న్యాయ నిర్ణేతలుగా ఆలిండియా రేడియో రిటైర్డ్ ఉద్యోగి బిట్రా గజగౌరి,తెలుగు భాషాభిమాని కె.రమాదేవిలు విచ్చేశారు.చెన్నై నగరంలోని ఎస్ కె పీడీ ,కేటిసిటి , టి.నగర్, మైలాపూర్ లలో ఉన్న కేసరి పాఠశాలల నుంచి 42 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. అద్భుత ప్రతిభను కనపరిచిన విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేసి నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలను,ఉపాధ్యాయులను ఘనంగా నిర్వాహకులు సత్కరించారు.

ఈ సందర్భంగా తెలుగు తరుణి అధ్యక్షురాలు కె. రమణి మాట్లాడుతూ చెన్నైలో కనుమరుగ వుతున్న తెలుగు భాషను రక్షించుకునేందుకు తమ సంస్థ పలు భాష సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా తెలుగు మీడియం చదువుతున్న విద్యార్థుల విద్యాభి వృద్ధికి తమ సంస్థ అండగా ఉంటుందని అన్నారు. బిట్రా గజగౌరి మాట్లాడుతూ తెలుగు భాషను మరువరాదని ,భాషపై మమకారం పెంచుకుని అందులో పట్టు సాధించాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో తెలుగు తరుణి కార్యదర్శి మాలతీ సంతోష్, కోశాధికారి మాజేటి అపర్ణ తోపాటు సభ్యులు కె. శైలజ, కర్లపాటి లక్ష్మి,మల్లికా ప్రకాష్, టి.జయశ్రీ రాజశేఖర్ ,విశాలాక్షి ,వసంత ,పద్మ, శ్రీదేవి ,నందిని ,మనిమాల రావు తదితరులు పాల్గొన్నారు.

About Author