September 20, 2024

కవిత్రయ మహాభారతం వర్తమాన సమాజం: సమాలోచనం పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం.

చెన్నై న్యూస్: మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో “కవిత్రయ మహాభారతం వర్తమాన సమాజం: సమాలోచనం” అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు 04.03.2024 న ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ప్రారంభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డా. పాండురంగం కాళియప్ప స్వాగతం పలికారు.గాయని నిడమర్తి వసుంధరాదేవి ఆలపించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్ధనతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి తెలుగు శాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ ఆంధ్ర మహాభారతంపై సదస్సు నిర్వహించాలని ఎప్పటి నుండో నా మదిలో కోరిక ఉండేదని, ఆ కోరిక నేడు నేరవేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.మహాభారతాన్ని ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అందులో విషయాలు కనపడుతాయని, అలాంటి మహాగొప్ప గ్రంథం ఎందరికో ఆదర్శనీయం అని పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ కాకుటూరు అనికుమార్ రెడ్డి మాట్లాడుతూ మహాభారతంపై అంతర్జాతీయ సదస్సు మద్రాసు విశ్వవిద్యాలయంలో నిర్వహించడం ఎంతో సంతోషింగా ఉందన్నారు. అందుకు ఆచార్య విస్తాలి శంకరరావును అభినందిస్తున్నాని తెలిపారు. మహాభారతంలోని ప్రతి పాత్ర ఒక పాఠ్యాంశమే అవుతుందని, కృష్ణుడు ఒక తత్తవేత్త అని, మహాభారతంలో అనేక అంశాలు వికాస సూత్రాలే అని, కురుక్షేత్రం యుద్ధం జరగడానికి గల కారణాన్ని అలాగే నాడు యుద్ధం తీరుకి నేటి యుద్ధం తీరుకు గల భేదాన్ని తెలియజేశారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆధ్యాత్మికవేత్త కె. ఆనందకుమార్ రెడ్డి మాట్లాడుతూ నేటి ఏ.ఐ. టెక్నాలజీకి,నానో టెక్నాలజీకి మూలాలు మహాభారతంలోనే ఉన్నాయని,అంతటి గొప్ప రచన మహాభారతం అని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథిగా ఎస్.ఆర్. హెచ్. విశ్వవిద్యాలయం, జర్మని నుంచి విచ్చేసిన వారు ఆచార్య గణేష్ తొట్టెంపూడి అంతర్జాలం ద్వారా పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ మహాభారతం రచన నేటి యువతకు ఎంతో ఆదర్శనీయ మైనదని పేర్కొన్కారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన కందనూరు మధు మాట్లాడుతూ మహాభారతం 5000 సంవత్సరాలకు పూర్వం వచ్చినా ఇప్పటికి ఈ గ్రంథం నేటి సమాజానికి అన్వయించుకునే విధంగా ఉంటుందని తెలియజేశారు.ఆత్మీయ అతిథులు డా. ఏ.వి. శివకుమారి మాట్లాడుతూ ఇంతటి గొప్ప సదస్సును నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అందుకు ఆచార్య విస్తాలి శంకరరావుగారు అభినందించాలని పేర్కొన్నారు. మరో ఆత్మీయ అతిథి బోట్స్ వాను, ఆఫ్రికా నుంచి ప్రముఖ సైకాలజిస్ట్ ఆచార్య శ్రీదేవి శ్రీకాంత్ అంతర్జాలం ద్వారా పాల్గొని మహాభారతంలోని ప్రతి పాత్ర మనోవికాసానికి ప్రతీకలని, ఆ పాత్రల ద్వారా నేటి సమాజంలోని మనస్తత్వ విశ్లేషణ
చేసుకోవడానికి వీలైనవే అని పేర్కొన్నారు. మరో ఆత్మీయ అతిథి డా. పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాభారతంలోని కాలానికి తగ్గట్లుగా మనం అందులోని విషయాలను అన్వయించుకోవచ్చని తెలియజేశారు.

నరుడు నారాయణుని ఎలా చేరుకోవాలో చెప్పేదే మహాభారతం: కీలకోపన్యాసం చేసిన మహాసహస్రావధాని డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ ధర్మబద్ధమైన కోరికలు ఉండాలని మహాభారతం మనకు తెలియజేస్తుందని, మహాభారతంలోని గొప్ప పాత్ర భీష్మ పాత్ర అని, ఆ పాత్ర ద్వారా ఎన్నో విషయాలు నేడు మంచి మార్గంలో నడుచుకోవడానికి కావలసినన్ని విషయాలు తెలుసుకోవాడానికి . మహాభారతం పర్యావరణ పరిరక్షణ ధోరణిలో రచించడం జరిగిందని. నరుడు నారాయణుని ఎలా చేరుకోవాలో చెప్పేదే మహాభారతం అని పేర్కొన్నారు.చివరగా డా. మాదా శంకరబాబు వందన సమర్పణతో ప్రారంభ సమావేశం ముగిసింది.సదస్సు తొలి రోజు మధ్యాహ్నం మొదటి సమావేశానికి డా. వై విజయానందరాజు అధ్యక్షత వహించారు. రెండవ సమావేశానికి డా. కట్టెపోగు సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. మూడవ సమావేశానికి డా. చాట్ల కిశోర్ అధ్యక్షత వహించారు. నాలుగవ సమావేశానికి డా. ఎస్. వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. చివరగా పత్ర సమర్పకులను ప్రశంసా పత్రాలను అందించటంతో మొదటి రోజు కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయింది.

About Author