March 7, 2026

అన్నానగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకగా ఆవణి అవిట్టం

చెన్నైన్యూస్:అన్నానగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వ
ర్యంలో ఆవణి అవిట్టం పేరిట శ్రావణి పౌర్ణమి సందర్భంగా నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. సంఘ అధ్యక్షులు, గోపురం సంస్థ అధినేత వైవీ హరికృష్ణ సారథ్యంలో అన్నానగర్ లో ఉన్న డాక్టర్ అంబే డ్కర్ అకాడమీ హాలులో 150 మందికి పైగా గృహస్థులు పాల్గొని గాయత్రి దేవికి పూజలు, హోమాలు చేశారు. పూర్ణాహుతి అనంతరం సంప్రదాయ బద్ధంగా యజ్ఞోపవీతధారణ నిర్వహించారు. ముఖ్య అతిధిగా టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ అడ్వైజర్ చీమకుర్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.. యజ్ఞోపవీత ధారణ సభ్యులందరూ నిర్ణీత స్థలంలో సామూహికంగా వేడుకలు చేసుకోవటం అభినందనీయమన్నారు.సంఘం అధ్యక్షులు వైవీ హరికృష్ణ ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. అనంతరం వైవీ హరికృష్ణ మాట్లాడుతూ అన్నానగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్యాత్మికంగానూ, సామాజికంగానూ సేవాలందిస్తుందన్నారు. ప్రతీ ఏడాది ఆర్యవైశ్యులంతా సమిష్టిగా కలసి యజ్ఞోపవీత ధారణ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ సంఘం తరపున ప్రతిఏడాది 100 మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లను కూడా అందజేస్తున్నట్టు తెలిపారు.

సంఘం కార్యదర్శి ఎం.కాళీ విశ్వనాథం మాట్లాడుతూ అన్నానగర్ ఆర్యవైశ్య సంఘ ప్రారంభమై మూడు దశాబ్దాలు అయింది. 25 ఏళ్లుగా జంధ్యాల పండుగను వైభవంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఉపాధ్యక్షులు వి ఎన్ హరినాధ్ మాట్లాడుతూ అన్నానగర్ ఆర్యవైశ్య సంఘంలో అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలుపుతూ ఈ సంఘంలో కొత్తగా సభ్యులు కావాల్సిన వారు తమను సంప్రదించగలరని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం మరో కార్యదర్శి ఎస్వీ ప్రసాదరావు, కోశాధికారి ఏవీ శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంకా, వైవీ నిరంజన్, పీజేపీఎన్ గుప్తా, కె.రవికుమార్ సహా సభ్యులు పాల్గొని గాయత్రి దేవికి పూజలు చేశారు.
సభ్యులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

About Author